
చట్టాలు తెలియక కటకటాల్లోకి..
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి గల్ఫ్ దేశం వెళ్తే.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన నక్క బాలనర్సు సౌదీ అరేబియాలో జైలుపాలయ్యాడు. తన భర్తను విడిపించాలని కోరుతూ అతని భార్య దేవేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జైలుపాలైన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర హైదరాబాద్ ప్రజాభవన్లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు ఆసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్లతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్ను కలిసి గోడు వినిపించారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడంతో అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడారు. రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గల్ఫ్ బాటలో జైలుపాలైన బాలనర్సు విడుదల కోసం అతని కుటుంబం నిరీక్షిస్తోంది.
సౌదీ జైలులో మండెపల్లివాసి
విడుదల చేయాలని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన వలసజీవి భార్య
మూడున్నరేళ్ల జైలుశిక్ష
క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం
స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యదేవరాజన్