
జీతం.. సతమతం
కరీంనగర్ అర్బన్: పాడి పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు వేతనాలు అందక మదనపడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా 9నెలలుగా సదరు వేతనం లేక ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 9నెలల గౌరవ వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు.
ఆర్ఎంపీల్లా గోపాలమిత్రలు
2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ)) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నట్టల నివారణ మందులు, వాక్సినేషన్, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు.
వేతనంలో 40 చొప్పున కట్
ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 80నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భధారణ (నేమన్) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని గోపాలమిత్రలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ పోషణ భారం
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్డీఏ) ద్వారా పశు సంవర్థకశాఖలో ఉమ్మడి జిల్లాలో 135 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,050 చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. చాలీచాలనీ వేతనం కూడా ప్రతినెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు.
గోపాలమిత్రలకు 9నెలలుగా అందని వేతనం
కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత