మరికొందరు ఇంజినీర్లు! | - | Sakshi
Sakshi News home page

మరికొందరు ఇంజినీర్లు!

Jun 13 2025 5:03 AM | Updated on Jun 13 2025 5:05 AM

ఏసీబీ రాడార్‌లో

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన ఇరిగేషన్‌ అధికారి నూనె శ్రీధర్‌ కాళేశ్వరంలో భాగమైన అదనపు టీఎంసీ పనుల్లో ఇరిగేషన్‌ క్యాడ్‌ డివిజన్‌– 8 ఈఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై దాడులు జరిగాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ దాడులు ఒక్కరితో ఆగేలా లేవు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరింత మంది ఇంజినీర్లపై ఏసీబీ దాడులు జరపనుంది. ఈ డివిజన్లో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ డివిజన్‌లో మొత్తం నాలుగు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో సబ్‌ డివిజన్‌కు ఒక డీఈఈ, అతనికి సహాయకంగా ఐదుగురు జేఈ ఈలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఆదాయానికి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో కొన్ని రోజులుగా ఏసీబీ వీరి ప్రతీ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. డివిజన్‌లో పనిచేస్తున్న ప్రతీ సిబ్బంది ఆస్తి పాస్తులు, వారు ప్రాజెక్టులో చేరినప్పటి నుంచి ఇప్పుటివరకు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు సమాచారం. ఇందులో కొందరు ఆస్తుల్లో గణనీయమైన ఎదుగుదల ఉన్నట్లు తెలిసింది. ఈ డివిజన్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు హైదరాబాద్‌, బెంగళూరుల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కొన్నిచోట్ల విల్లాలు, రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించింది. కొంతకాలంగా వీరి ఇళ్లల్లో జరిగిన వివాహ, ఇతర వేడుకలకు భారీగా వెచ్చించడాన్ని కూడా ఏసీబీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం ఏసీబీ అధికారులు పలు రెస్టారెంట్లలో సోదాలు చేయడమే ఈ డివిజన్‌లో పనిచేసే సిబ్బందికి ఆయా రెస్టారెంట్లలో వాటాలు ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో త్వరలోనే మరింత మంది అధికారులపై ఏసీబీ దాడులు చేయనున్నట్లు సమాచారం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి డివిజన్‌లో పనిచేస్తున్న చాలామంది అధికారులకు స్థానచలనం కలగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లోనూ రాష్ట్రమంతటా ట్రాన్స్‌ఫర్లు జరిగినా.. వీరికి ప్రత్యేక మినహాయింపు రావడం వెనక భారీ లాబీయింగ్‌ జరిగిందని ప్రచారం సాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టులో ఇటీవల విచారణ కమిషన్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్‌ ఇంజినీర్లు కూడా గతంలో ఇదే అదనపు టీఎంసీ ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం గమనార్హం.

కాళేశ్వరం అడిషనల్‌ టీఎంసీ ప్రాజెక్టు ఇంజినీర్‌ నివాసాల్లో సోదాలు

భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని ఏసీబీకి వరుస ఫిర్యాదులు

రెస్టారెంట్లు, విల్లాలు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించిన ఏసీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement