
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్య
కరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు.