
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బావిలో పడి వృద్ధుడు మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.