ధాన్యం రాశిపై అడవి పందుల దాడి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం రాశిపై అడవి పందుల దాడి

May 31 2025 12:56 AM | Updated on May 31 2025 12:56 AM

ధాన్యం రాశిపై అడవి పందుల దాడి

ధాన్యం రాశిపై అడవి పందుల దాడి

రుద్రంగి(వేములవాడ): ఓవైపు నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయక రైతన్న ధాన్యం వర్షాలకు మొలకెత్తుతుంటే.. అదే ధాన్యంపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్‌ కవర్లు చింపి ధాన్యం చిందరవందర చేస్తున్నాయి. గురువారం రాత్రి మండల కేంద్రానికి చెందిన అక్కెనపెల్లి నర్సింగరావు అనే రైతుకు చెందిన ధాన్యం రాశిపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్‌ చింపి వేశాయి. ధాన్యాన్ని చెల్లాచెదురు చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు.

22 మంది మందుబాబులకు జైలు

వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జైలుశిక్ష విధించినట్లు వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. స్టేషన్‌ పరిధిలో గత 14 రోజులుగా డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా 36 మంది మందుబాబులను పట్టుకున్నట్లు వివరించారు. వీరందరిని శుక్రవారం వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌ ఎదుట హాజరుపరచగా 36 మందిలో 22 మందికి జైలు, 14 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, నలుగురికి నాలుగు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒకరికి ఐదు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒక వ్యక్తికి ఏడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా విధించారని తెలిపారు.

ఐదుగురికి..

చందుర్తి(వేములవాడ): డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేలు జరిమానాను మెజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ విధించినట్లు చందుర్తి ఎస్సై బి.అంజయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. మెట్‌పల్లికి చెందిన ఒకరు, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఒకరు, ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి, వేములవాడ రూరల్‌ మండలం తిప్పయ్యపల్లికి చెందిన ఒకరు, చందుర్తికి చెందిన మరొకరికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించినట్లు ఎస్సై అంజయ్య వివరించారు.

ట్రాక్టర్‌, జేసీబీ పట్టివేత

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ ఆఫీస్‌కు తరలించారు. మండలంలోని దేవునిగుట్టతండాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకోగా.. గొల్లపల్లి హైస్కూల్‌ వద్ద తప్పించుకున్నారు.

గల్ఫ్‌ కార్మికులకు అండగా రేవంత్‌రెడ్డి సర్కార్‌

వేములవాడ: గల్ఫ్‌ కార్మికులకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్‌ సమితి ఖతర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఖతర్‌ వెళ్లిన ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఖతర్‌లోని లేబర్‌ క్యాంపులను సందర్శిస్తూ కార్మికుల బాధలు తెలుసుకొని వారిలో ఆత్మస్థయిర్యం, మనోనిబ్బారాన్ని నింపారు. టీపీసీసీ గల్ఫ్‌ కన్వీనర్‌, గల్ఫ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్‌, టీపీసీసీ ఖతర్‌ కన్వీనర్‌ నిజామోద్దీన్‌ ఖాజా, తెలంగాణ గల్ఫ్‌ సమితి ఖతర్‌ ఫౌండర్‌ మెంబర్లు శంకర్‌గౌడ్‌, ఎల్లన్న తల్లపెల్లి, వెంకటేశ్‌, ఎల్లన్న మండపెల్లి, గడ్డి రాజు, చింతకుంట మహేందర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement