డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు! | - | Sakshi
Sakshi News home page

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!

May 29 2025 1:05 AM | Updated on May 29 2025 1:05 AM

డీఈవో

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!

● మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కరీంనగర్‌వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్‌రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్‌ కార్యాలయం తీరుపైనా విమర్శలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రీంనగర్‌ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్‌రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ.. కలెక్టర్‌ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్‌ మహిళా కమిషన్‌కు ఎక్స్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్‌ టీచర్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) నాయకులు జనార్దన్‌రావుపై హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్‌ చేసింది. బుధవారం కూడా సోషల్‌ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్‌ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్‌. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ డైట్‌ ప్రిన్సిపాల్‌ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు.

దండిగా పెద్దల దన్ను..

జనార్దన్‌రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్‌ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే.

● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు.

● హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్‌, ఇటీవల టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం.

● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్‌ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది.

● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్‌ చేసిన మెడికల్‌ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

● హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది.

● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం.

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!1
1/3

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!2
2/3

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!3
3/3

డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement