
రహదారికి అనుమతులు నిలిపివేయాలి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక వైకుంఠధామం నుంచి నీలోజిపల్లికి చెందిన ఓ రైతుకు ఇచ్చిన రహదారి అనుమతులు నిలిపివేయాలని కొదురుపాక గ్రామస్తులు పలువురు తహసీల్దార్ కాలె నారాయణరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి అనుమతులు లేకుండానే దారి కోసం రైతు వైకుంఠధామంలో సుమారు 56 పచ్చని చెట్లు నరికేశాడని ఆరోపించారు. సదరు రైతుకు వేరే చోటు నుంచి రహదారి ఉన్నప్పటికీ మళ్లీ దారి కావాలని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ బాలమల్లు, వెంకటేశ్, దీక్షిత్, కత్తెరపాక రవీందర్ తదిరతరులు పాల్గొన్నారు.