
రెక్కలు?
భూముల ధరలకు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు, భూముల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు.
కమిటీలు ఇలా..
భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీస్) చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్గా సబ్రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు.
మే నెలాఖరుకు నివేదిక
ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 28న నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)
ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం
2024 88,762 231.98
2025 32,383 86.25
మరోసారి మార్కెట్ విలువ పెంపు
50 నుంచి 100శాతం
పెంచేలా కసరత్తు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం
మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు
నివేదికకు మే నెలాఖరు సమయం
భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు