
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి
సిరిసిల్ల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లు, డీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వానాకాలం సీజన్ కోసం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అన్ని జిల్లాలకు అందిస్తున్నామని, వీటిని రైతులకు చేరవేయాలన్నారు. నాణ్యమైన వరి విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు, కంది 150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,775 క్వింటాళ్లు విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుందని వివరించారు. కొంతమంది రైతులు నాణ్యత లేని ప్రైవేట్ విత్తనాల పట్ల ఆకర్షితులై నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు రసీదు పొంది పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మాట్లాడుతూ, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లాలో 18 ఐకేపీల ద్వారా విత్తన లైసెన్సులు జారీ చేయించి 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల అమ్మకాలు జరిపిస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి, విత్తన అధికారి మౌనిక, ఏపీడీ గొట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.