
ఐఐహెచ్టీ కోర్సుతో నమ్మకమైన ఉపాధి
● టెస్కో జీఎం అశోక్రావు
సిరిసిల్ల: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) మూడేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే నమ్మకమైన ఉపాధి లభిస్తుందని టెస్కో జనరల్ మేనేజర్ వి.అశోక్రావు అన్నారు. సిరిసిల్ల నేత బజారులో మంగళవారం ఐఐహెచ్టీ కోర్సులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వెంకటగిరిలో ఈ కోర్సు చదువు ఉండేదని, తెలంగాణలో గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఐఐహెచ్టీ కోర్సును ప్రవేశ పెట్టి 60 సీట్లను కేటాయించారన్నారు. ఇందులో చేరిన అభ్యర్థులు చిత్తశుద్ధితో కోర్సు పూర్తి చేసి నైపుణ్యం పెంచుకుంటే చేనేత, జౌళిశాఖ ఉద్యోగాల్లో చేరవచ్చని, ప్రైవేటుగా స్పిన్నింగ్, గార్మెంట్, టెక్స్టైల్ పరిశ్రమల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
ఫీజుల భారం లేకుండా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐఐహెచ్టీలో చేరాలన్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలను నివృతి చేశారు. సమావేశంలో జౌళిశాఖ డీడీ విద్యాసాగర్, ఏడీ విజయ్, డీవో రవీందర్రెడ్డి, సంతోష్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.