
‘డబుల్’ ఇళ్ల బిల్లులు ఇప్పించండి
ఇల్లంతకుంట(మానకొండూర్): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదని, ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పలువురు బాధితులు విన్నవించారు. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన 20 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనట్లు మూడేళ్ల క్రితం వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్ వచ్చినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి కాంట్రాక్టర్తో అగ్రిమెంటు కోసం ఒక్కొక్కరం రూ.10వేలు డీడీ కోసం చెల్లించినట్టు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 20 మందిలో 11 మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోగా కొన్ని పూర్తిస్థాయిలో, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు ఇప్పించాలని వేడుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ చల్ల నారాయణ, బాధితులు ఎండీ కరీం, క్రాంతి, మచ్చ ప్రభాకర్, బట్టి మల్లేశం, జాని, రాజు పాల్గొన్నారు.