
కష్టాల మూట
కార్డుదారులకు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ తీరుతో కార్డుదారులు నరకం చవిచూస్తున్నారు. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ దుకాణాలకు తంటాలు పడుతూ వెళ్లి బియ్యం తీసుకున్నా.. మోసుకెళ్లే క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు పడుతున్న అవస్థలు అన్నీ కావు. దీనికి తోడు సర్వర్ తరచూ మొరాయిస్తుండటంతో గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. అంతసేపు క్యూలో నిల్చోలేక వృద్ధులు, మహిళలు నేలపై కూలబడి తమ వంతు కోసం వేచి చూస్తున్న పరిస్థితి. డీలర్లు బియ్యం ఇంటికి తెచ్చి ఇవ్వరన్న భయం, లేవని తిరస్కరిస్తారన్న ఆందోళనతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ షాపుల వద్దకు క్యూకడుతున్నా వారికి భరోసా ఇచ్చే వారు కరువయ్యారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం తెచ్చిస్తారన్న అధికారుల మాట కేవలం ప్రకటనలకే పరిమితమైంది.
అప్పుడే బాగుంది.. ఇప్పుడిదేంది?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించకూడదనే సదుద్దేశంతో ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు) విధానాన్ని తీసుకొచ్చారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో సంతోషంగా తీసుకున్నారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న విధానానికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతూ ఎండీయూ వాహనాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో కార్డుదారులు శాపనార్థాలు పెడుతూ బియ్యం మోసుకెళ్తున్నారు. పల్లెల్లో రేషన్ పంపిణీ తీరు దారుణంగా మారింది. సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేక కార్డుదారులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.
బియ్యం మోసుకెళ్లలేక మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు
పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు
సర్వర్ మొరాయిస్తుండటంతో ప్రహసనంగా సరుకుల పంపిణీ

కష్టాల మూట