హామీల హేళన | - | Sakshi
Sakshi News home page

హామీల హేళన

Jun 4 2025 1:51 AM | Updated on Jun 4 2025 2:10 AM

హామీల

హామీల హేళన

కక్షల పాలన..

బాబు ఏలుబడిలో జిల్లా వాసులు అడుగడుగునా దగా పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి మరోసారి మోసపోయారు. జిల్లాకు జీవనాడులుగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు, పశ్చిమ ప్రకాశం వాసుల ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచే మెడికల్‌ కళాశాలను నిర్వీర్యం చేశారు. ఇక జిల్లాలో మిర్చి, శనగ, పత్తి, వరి, పొగాకు రైతులు గిట్టుబాటు ధర రాక రైతాంగం కుదేలవుతోంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసినా కూటమి సర్కార్‌ కనికరించలేదు. మార్కాపురం జిల్లా అంటూ ఊరించి ఉసూరుమనిపించారు. ఒంగోలు జీజీహెచ్‌పై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దొనకొండ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అటకెక్కింది. ఇక సంక్షేమ పథకాలు సరేసరి. రేషన్‌ బియ్యం కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలా ఏడాది కాలంగా జిల్లా వాసులు అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారు. ఇదేమని అడుగుతున్న వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటూ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏడాది దగా పాలనపై ఫోకస్‌..

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌

మిర్చిని కుప్పగా పోస్తున్న రైతు (ఫైల్‌)

అసంపూర్తిగా ఉన్న మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి జిల్లా ప్రజలు నిలువునా దగాపడ్డారు. జిల్లాకు జీవనాడి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో సాగు, తాగు నీటిని అందిస్తానని ప్రగల్భాలు పలికాడు. జిల్లాతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్‌ కడప జిల్లాలకు ఎంతో ప్రయోజనకారి అయిన వెలిగొండ ప్రాజెక్టుకు మొండి చేయి చూపి మొన్నటి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.116 కోట్లు కూడా కేటాయించి చిన్న చూపు చూశాడు. చివరకు 2026 జూలై నెలకు కానీ వెలిగొండ నుంచి నీరు ఇవ్వలేమని ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు కింద పునరావాసం పూర్తికాలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలకు పైసా కూడా విదిల్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టును చుట్టపు చూపుగా సందర్శించిన ముగ్గురు మంత్రుల బృందం పోలవరం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు వెలిగొండ అని, వచ్చే సీజన్‌ నుంచి నీళ్లు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ముంపు గ్రామాలకు ఆర్వో ప్యాకేజి, రెండో సొరంగంలో కొంత మేర పనులు మినహా వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి హయాంలోనే మొత్తం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2014 నుంచి 2019 మధ్య వెలిగొండ ఎలా నిర్లక్ష్యానికి గురైందో ఇప్పుడూ అంతేనని జిల్లా వాసులు నిట్టూరుస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒంగోలు జీజీహెచ్‌కు మహర్దశ పట్టింది. వందల కోట్లతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. మెడికల్‌ కళాశాలకు పీజీ సీట్లు వచ్చేలా కృషి చేసింది. కరోనా సమయంలో జీజీహెచ్‌లో అందించిన సేవలు నేటికీ ప్రజలు గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్‌ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది.

మెడికల్‌ కళాశాల, కొత్త జిల్లాలకు మంగళం..

గత ఏడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మార్కాపురం, పొదిలి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే వెంటనే వెలుగొండ పూర్తిచేస్తానని, మార్కాపురాన్ని జిల్లా చేస్తానని హామీలు ఇచ్చారు. ఈ రెంటినీ నెరవేర్చకపోగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను బదిలీ చేశారు. ఈ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యం అందకుండా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయిన మెడికల్‌ కళాశాల భవనాలు నిరుపయోగంగా మారాయి. చంద్రబాబు నిర్ణయం ఫలితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలకు పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లా చేస్తానన్నారు. ఏడాది పూర్తవుతున్నా ఆ ఊసేలేకుండా వంచనకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మిర్చి క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇంత వరకూ ఆ ప్రకటన మాటలకే పరిమితమైంది.

– ఎన్నికల సందర్భంగా గత సంవత్సరం జనవరి 5వ తేదీ కనిగిరిలో చంద్రబాబు ‘రా కదలిరా..కార్యక్రమం’ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. కనిగిరి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, కనిగిరి ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తానని, ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్మిస్తానన్నారు. కనిగిరికి సురక్షిత జలాలు.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ ఏర్పాటు మంజూరుకు హామీ ఇచ్చారు. ఏడాదైనా.. అవి అమలుకు నోచుకోలేదు. యువగళం పాదయాత్రలో నారాలోకేష్‌ పలు హామీలు ఇచ్చారు. వలసల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ఇంటింటికీ సాగర్‌ నల్లా నీరు అందిస్తామని, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ సెంటర్లు పెంచి, పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమిస్తామని, బత్తాయి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు.

పచ్చమూకల దౌర్జన్యకాండకు అంతేలేదు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఒకవైపున ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే సచివాలయాల మీద దాడులు చేసి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. సచివాలయాలు ప్రభుత్వ సంపద అనే ఇంగితం కూడా మరచి పచ్చమూకలు దాడులు చేస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారు. ఎక్కడా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఎక్కడా స్పందించలేదు. మాకు తెలియదు, ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ బుకాయించారు. ఎక్కడైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్వీకరించలేదు. ఒకటి అరా ఫిర్యాదులను స్వీకరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇష్టారాజ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పచ్చమూకలు దాడులకు తెగబడ్డాయి. ఒంగోలు నగరంలో పార్టీకి చెందిన ఒక నాయకుడిని మేకులు కొట్టిన కర్రలతో దాడి చేసి కొట్టడం సంచలనం సృష్టించింది. నగర శివారులోని ఒక సానుభూతిపరుడి కారును ధ్వంసం చేయడమే కాకుండా పోలీసుల సమక్షంలోనే అతడి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి కుటుంబ సభ్యులపై సైతం కర్రలు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఇదే పరిస్థితి జిల్లా అంతటా కనిపించింది. ఈ ఏడాది కాలంగా జిల్లాలో ఇదే తరహాలో దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. మహిళలని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి పాలనలో రాష్ట్రం మరో బీహారులా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిపైనా కేసులు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎప్పుడో సోషల్‌ మీడియాలో చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మీద కూడా కేసులు పెట్టింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై ఏకంగా ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద కూడా కేసులు పెట్టించింది. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తోంది.

జీవనాడులపై పోట్లు

రైతుల కష్టాలు తీర్చలేనివి..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా సాగింది. సకాలంలో వర్షాలు పడటంతో పాటు సాగర్‌ జలాలు ఐదేళ్ల పాటు సజావుగా తాగు, సాగుకు అందాయి. పుష్కలంగా పంటలు పండాయి. బహిరంగ మార్కెట్‌లోనే పంటలకు మంచి ధరలు వచ్చాయి. పొగాకులాంటి పంటకు గిట్టుబాటు ధర రాకపోతే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మాడు పొగాకును కూడా అత్యధిక ధరకు కొనుగోలు చేయించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రస్తుతం జిల్లాలో రైతు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. సకాలంలో వర్షాలు లేవు. ఒక వేళ వర్షాలు పడినా ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అలమటిస్తున్నారు. మిర్చి, పత్తి, శనగ, వరి, పొగాకు రైతులు మద్దతు ధర రాక కుదేలవుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి పండించిన ఒక్క పంటను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఆదుకున్న పాపాన పోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ చార్జీలపై జనం గగ్గోలు..

పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఒంగోలు నగరం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీలు పెంచారనీ, తాను అధికారంలోకి వచ్చిన తదుపరి విద్యుత్‌ చార్జీలు తగ్గిస్గానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు పెంచుకుంటూ పోతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు.

పొగాకుకు గిట్టుబాటు ధరల కోసం కొండపి–టంగుటూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్‌)

డ్రైవింగ్‌ స్కూలు.. మొండిగోడలు

13 నెలల కిందట ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు దర్శిని అభివృద్ధి చేసి ఎక్కడికో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభిస్తాననన్నారు. ప్రస్తుతం దాని గేటు తీసి ఎలా ఉందో చూసిన దాఖలాలు కూడా లేవు. దొనకొండను పారిశ్రామికవాడ చేస్తానని పాతపాట పాడారు. దొనకొండ వైపు ఒక్క కంపెనీ ప్రతినిధి వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు. మొగలిగుండాల రిజర్వాయరు ముఖమే చూడలేదు. రాగమొక్కపల్లి ఎంఎస్‌ఎంఈ కి ఊసే లేదు. గుండ్లకమ్మ నీరు ముండ్లమూరు, తాళ్లూరుకు కు నీరందిస్తానని పట్టించుకోలేదు. ఇలా ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

హామీల హేళన1
1/7

హామీల హేళన

హామీల హేళన2
2/7

హామీల హేళన

హామీల హేళన3
3/7

హామీల హేళన

హామీల హేళన4
4/7

హామీల హేళన

హామీల హేళన5
5/7

హామీల హేళన

హామీల హేళన6
6/7

హామీల హేళన

హామీల హేళన7
7/7

హామీల హేళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement