
బాబు వెన్నుపోటుపై నిరసన గళమెత్తండి
ఒంగోలు సిటీ: ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కోరారు. చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజలు నిరసన గళమెత్తాలన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. రైతులు, మహిళలు, యువకులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై నిరసన తెలపాలన్నారు.
షూటింగ్లో జిల్లా స్థాయి ఎంపికలు రేపు
ఒంగోలు: ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ఈనెల 5న స్థానిక నెక్ట్స్జెన్ స్కూలులో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రైఫిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమ్మ ఖాదర్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్ రైఫిల్, పీప్ సైట్, ఓపర్ సైట్, పిస్టల్ విభాగాల్లో అండర్ 16, 19, 21, 21 నుంచి 45 సీనియర్ కేటగిరీలకు సంబంధించి ప్రతిభను పరీక్షిస్తారన్నారు. బాలబాలికలకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారు మాత్రమే ఈ ఎంపికకు అర్హులు. ఈ పోటీల్లో మంచి పాయింట్లు సాధించిన వారు ఈనెల 21 నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9505561357 నంబర్ను సంప్రదించాలన్నారు.
బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్–23 బాలుర బాస్కెట్ బాల్ జట్టును కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఎంపిక చేశారు. మొట్టమొదటి అండర్–23 త్రీ అండ్త్రీ రాష్ట్ర చాంపియన్షిప్ చిత్తూరులో ఈ నెల 4, 5వ తేదీల్లో జరుగుతుంది. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు అభినందించారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మార్కాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిస్మిస్
మార్కాపురం: మార్కాపురం అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా (ఎఫ్ఆర్ఓ)గా పనిచేస్తున్న వరప్రసాద్ పై వచ్చిన లైంగిక వేధింపుల కేసులో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట న్యాయస్థానం శిక్ష విధించిన నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరప్రసాద్ గతంలో సూళ్లూరుపేటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మహిళా ఉద్యోగిని పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఈ ఏడాది ఏప్రిల్లో న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో వరప్రసాద్ పై నేరం రుజువై శిక్ష ఖరారు కావడంతో ఆయన్ను ప్రభుత్వ విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము పేరుతో మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

బాబు వెన్నుపోటుపై నిరసన గళమెత్తండి