
ఎమ్మెల్యే బూచేపల్లి బక్రీద్ శుభాకాంక్షలు
దర్శి (కురిచేడు): జిల్లాలోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీక గా ముస్లింలు బక్రీద్ పండుగ చేస్తారని అన్నారు. పేదలకు దాన ధర్మాలు చేసే బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
నిర్ధిష్ట వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు టౌన్: పరిశ్రమల స్థాపనకు నిర్ధిష్ట వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనంలో ప్రత్యేక జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమల అనుమతులు కోసం వివిధ శాఖలకు చెందిన 137 దరఖాస్తుల్లో 110 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా నిర్ధిష్ట గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రాయితీలకు 449 క్లైయిమ్లకు గాను రూ.7.22 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాబార్డు ఏజీఎం రవి కుమార్, ఏపీఐఐసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలి
ఒంగోలు టౌన్: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు కోరారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం–1977ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జంతువుల అక్రమ రవాణా, జంతు వధ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా జంతువధ శాలల వద్ద ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. స్లాటర్ హౌస్ల వద్ద పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
వీరయ్య చౌదరి హత్య కేసులో ఇద్దరు అరెస్టు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో శుక్రవారం మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయ పాలెం గ్రామానికి చెందిన గోళ్ల రుత్యేంద్ర బాబు అలియాస్ నాని, నెల్లూరు జిల్లాకు చెందిన ఓబిలి నాగరాజును త్రోవగుంట వద్ద అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులకు రిమాండ్ విధించారు. నాని మీద రౌడీషీట్ తో పాటు రెండు హత్యకేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యే బూచేపల్లి బక్రీద్ శుభాకాంక్షలు