
రోజు రోజుకూ పొగాకు ధరలు దిగజారుతున్నాయి
● ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకీ ధరలు దిగజారుతున్నాయని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం చుండూరి రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోగ్రేడ్ను రూ.180 లకు కొనేటప్పుడు బేళ్లు వెనక్కు వెళుతున్నాయనీ, రూ.240 పెట్టి కొనేటప్పుడు కూడా వెనక్కి పంపిస్తున్నారన్నారు. కూలీ రైతులు, కౌలు రైతులు, నోరులేని రైతులు అయ్యేసరికి కంపెనీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఆర్డర్లు వచ్చాయి కాబట్టే పొగాకును కొనుగోలు చేస్తున్నారనీ, ఆర్డర్లు రాలేదని చెప్పడం అవాస్తమన్నారు. మే నెల మొదటి వారంలోనే ఆర్డర్లు వచ్చాయనీ, ఇప్పటికీ ఆర్డర్లు రాలేదని చెప్పడం అబద్ధమన్నారు. గత సంవత్సరం పొగాకు ధరలు బాగా ఉన్నాయని, ఈ సంవత్సరం వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. బోర్డు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. బోర్డు అధికారులే రైతులకు ఇంకా ధర తగ్గిపోతుందని అని చెప్పడం దారుణమన్నారు. రైతులను చైతన్య పరిచాల్సిన వారే ఇంకా రేటు తగ్గుతుందని చెబుతూ వారి కమీషన్ వారు తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మీరు ఒత్తిడి చేయండి కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సిన వారే కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకుని అమ్ముకోండి ఇంకా రేట్లు తగ్గుతాయని రైతుల ఆశలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. వారికి వచ్చే కమీషన్ కోసం ఒత్తిడి పెడుతూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఫ్లోర్లలో ఉండే రైతు నాయకులు, వారి అనుయాయుల బేళ్లు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతులకు సహాయం చేయకుండా వారికి అండగా నిలబడకుండా ఉంటున్నారని విమర్శించారు. రైతుల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. రైతుల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తేనే రైతులు నష్టాల నుంచి బయటపడతారని, లేకపోతే ఆత్మహత్యల పాలవుతారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మన జిల్లాలో నష్టపోయి ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. చుండూరి వెంట ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.