
ఎండ ప్రచండం
నిర్మానుష్యంగా ఉన్న చర్చి సెంటర్
ఒంగోలు టౌన్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజుల నుంచి ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపిస్తోంది. నడినెత్తిన సూర్యుడు భగభగమంటుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన మాట వాస్తవమన్నట్లుగా నిప్పుల కుంపటిలా ఎండ వేడి వేధిస్తోంది. మే 27 నాటికి రుతుపవనాలు వచ్చేస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చెప్పినట్లే మూడు రోజుల పాటు వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఇక ఎండా కాలం ప్రభావం ముగిసినట్లేనని అంతా భావించారు. అందుకు భిన్నంగా మళ్లీ ఎండలు మండిపోవడం మొదలైంది. ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది. మారిన వాతావరణంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దానికి తోడు గాలి స్తంభించడంతో ఉక్కపోత అల్లాడిస్తోంది. కొద్దిసేపు ఫ్యాను తిరగకపోతే చెమటలతో దేహమంతా తడిసిపోతోంది. ఉదయం 6 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది. 10 గంటల కల్లా తీవ్రరూపం దాలుస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు ఉక్కపోతతో వేడి గాలులు వీస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లా అంతటా 39 డిగ్రీల ఎండ కాయగా శుక్రవారం 40 డిగ్రీ గరిష్ట ఉష్ణోగ్రత, 29.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
జిల్లాలో నానాటికీ తీవ్రమవుతున్న ఎండలు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఉదయం నుంచే భానుడి ప్రతాపం షురూ

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం