
ప్రశాంతంగా డీఎస్సీ
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 629 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 24,659 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి రోజు రెండు షిఫ్ట్ల్లో పరీక్షలు జరుగుతాయి. ఒంగోలు నగరంతోపాటు మార్కాపురం పట్టణంలో మొత్తం ఎనిమిది కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తొలి రోజు 5 కేంద్రాల్లో 791 మంది హాజరు కావాల్సి ఉండగా 718 మంది హాజరయ్యారు. 81 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో 170 మందికి గాను 147 మంది, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో 200 మందికి 179 మంది, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో 201 మందికి గాను 189 మంది, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో 120 మందికి గాను 106 మంది, కృష్ణచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి గాను 89 మంది హాజరయ్యారు.
మెగా డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలులో మెగా డీఎస్సీ పరీక్ష జరుగుతున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్ష జరుగుతుందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారన్నారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ మధుసూదన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ప్రశాంతంగా డీఎస్సీ

ప్రశాంతంగా డీఎస్సీ

ప్రశాంతంగా డీఎస్సీ

ప్రశాంతంగా డీఎస్సీ