
పీఆర్సీ కమిషన్ నియమించాలి
ఒంగోలు సిటీ: సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడంతోపాటు మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. సంఘ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన విజయవాడలోని లయోలా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్ మూడో సమావేశానికి ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 14 ప్రధాన డిమాండ్ల సాధనకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న పీఆర్సీ, డీఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపునకు కాలపరిమితితో కూడిన రూట్ మ్యాప్ విడుదల చేయాలన్నారు. సీపీఎస్/జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే వేతనం, పెన్షన్ల చెల్లింపు చట్టబద్ధం చేయాలన్నారు. జూన్ 5వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రకాశం భవన్ నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి వరకుమార్, పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, ట్రెజరర్ యేసు రత్నం, తాలూకా అధ్యక్షుడు సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
డిమాండ్
14 ప్రధాన సమస్యల పరిష్కారానికి జూన్ 5న కౌన్సిల్ సమావేశం