
వేగవంతం చేయండి
లబ్ధిదారుల గుర్తింపు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రకాశం భవనం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, సీసీఆర్సీ కార్డుల మంజూరుపై క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, ఇతర ప్రయోజనాలు లభించడానికి సీసీఆర్సీ కార్డులే ప్రధానమైనందున రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. వాస్తవ భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా సాగుదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు లభించేలా చూడాలన్నారు. గ్రీవెన్స్ ఆర్జీల పరిష్కారంపై, రెవెన్యూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ మాట్లాడుతూ సీబీజీ, ఎంఎస్ఎంఈ, ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రతి నెలా మూడో సోమవారం ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నందున ఎలాంటి లోపాలు లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.