
పాలీసెట్లో జిల్లా విద్యార్థుల సత్తా
ఒంగోలు సిటీ/ చీమకుర్తి : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 30న నిర్వహించిన పాలీసెట్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షకు మొత్తం 3,950 మంది విద్యార్థులు హాజరు కాగా 3804 మంది అర్హత సాధించారు. చీమకుర్తికి చెందిన ఖదిరీష్ 120/120 మార్కులు సాధించి జిల్లా ప్రథమస్థానం, రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 120/120 మార్కులను పలువురు సాధించడంతో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించాడు.
ఖదిరీష్ను శ్రీసూర్య పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రుషి, తల్లిదండ్రులు, బంధువులు, కాలేజీ అధ్యాపకులు అభినందించారు. అలాగే బెల్లంకొండ వెంకట్ జిల్లాస్థాయిలో రెండోర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించాడు. పి.లారారోజ్ జిల్లాస్థాయి మూడవ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 196వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఒంగోలులో ఏడు, మార్కాపురంలో నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
జాతీయస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక
మార్కాపురం: కర్నూల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన జాతీయస్థాయి ఉషూ పోటీల్లో మార్కాపురం పట్టణానికి చెందిన పొట్టేళ్ల బసవేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా బసవేశ్వరరావు మాట్లాడుతూ జూన్లో భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. బసవేశ్వరరావును పలువురు అభినందించారు. రాష్ట్ర వుష్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహారావు, జిల్లా సెక్రటరీ నేషనల్ కోచ్ చంద్రశేఖర్ అభినందించారు.
‘మీకు ఇష్టమొచ్చినట్లు చేయలేను’
కొత్తపట్నం: ‘మీకు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు. రికార్డులన్నీ సక్రమంగా ఉంటేనే చేస్తామ’ని కొత్తపట్నం తహసీల్దార్ పి.మధుసూదన్రావు స్పష్టం చేశారు. స్థానిక నల్లూరి గార్డెన్స్లో బుధవారం అధికారులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ నాయకుడు చంపాని రామచంద్రయ్య తహసీల్దార్పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని, మీకు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదని చెప్పారు. అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ చేయాల్సిన మాపై ఉందని సమాధానం ఇచ్చారు.
నేడు ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
రాచర్ల: రాచర్లకు చెందిన ఆర్మీ జవాన్ గంజికుంట్ల మౌళిమనోహర్ (40) ముంబయిలోని ఏఎంసీ సెంటర్లో వీధులు నిర్వహిస్తూ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. మౌళిమనోహర్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులైన సుబేదార్ బీన్బీ, హవల్దారులు రాధాకృష్ణనాయర్, నాగసాయిబాబు బుధవారం రాత్రి 7:30 గంటలకు రాచర్లలోని నివాసానికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.