
హైవేపై అదుపుతప్పిన కారు
సీఎస్పురం(పామూరు): తల్లిని చూసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం పామూరు మండలంలోని కంభంపాడు, కోవిలంపాడు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై కథనం మేరకు వివరాలు.. మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన బాణాల కృష్ణ గత కొంతకాలంగా బెంగళూరులో కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఏప్రిల్ 28వ తేదీన కృష్ణ తన అత్తగారి ఊరైన కనిగిరి మండలంలోని బల్లిపల్లె వచ్చాడు. రెండు రోజులు అక్కడ గడిపి సీఎస్పురం మండలంలోని అరివేములలో ఉంటున్న తన తల్లిని చూసేందుకు కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో పామూరు మండలంలోని కంభంపాడు–కోవిలంపాడు మధ్య హైవేపై కారు అదుపుతప్పి రోడ్ మార్జిన్లో బోల్తా కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా కారు నుజ్జునుజ్జయింది. మృతునికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై ఆర్.సుమన్ పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిమిషాల్లోనే ఇంటికి.. అంతలోనే విషాదం
మరికొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్లి తన తల్లిని చూస్తాననుకున్న కృష్ణను ఊహించని రీతిలో మృత్యువు బలితీసుకుంది. కృష్ణ మృతితో స్వగ్రామంతోపాటు అత్తగారి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి.. తన కుమారుడు ఇక ఎప్పటికీ తిరిగిరాడని తెలిసి గుండెలవిసేలా రోదిస్తోంది.
ప్రమాదంలో ఒకరు దుర్మరణం
తల్లిని చూసేందుకు వెళ్తుండగా ఘటన