
మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకై క మార్గమని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం చేయడంతోపాటు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదని చెప్పారు. జిల్లా మీదుగా రవాణా అవుతున్న గంజాయిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణపై రూపొందించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మా నాయక్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.