
సాక్షి, అమరావతి / కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కమీషన్లు, వాటాల పంపకంలో తేడాలతో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగక బహిరంగంగానే ఘర్షణలకు దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే రెండు వర్గాల నేతలు గొడవకు దిగారు. అక్కడి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో సమావేశం రసాభాసగా మారింది.
ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీటెక్ రవి వర్గం గొడవకు దిగడంతోపాటు ఆయనపై దాడికి యత్నించింది. మంత్రి సవిత, ఇతర నేతలు ఎంత సర్దిచెప్పినా, ఇరు వర్గాల మధ్య తోపులాట, తిట్లవర్షం కొనసాగింది. మద్యం, ఇసుక, మైనింగ్లో వచ్చిన అవినీతి డబ్బు పంపకాలు, కమీషన్ల తేడాలతో ఇరు వర్గాల మధ్య చాలా రోజులుగా పరస్పరం దూషణలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. అవి శ్రుతిమించడంతో మంగళవారం విభేదాలు రచ్చకెక్కాయి.
మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు
కర్నూలు స్టేట్ గెస్ట్హౌస్ వేదికగా టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఏకంగా మంత్రి నిమ్మల రామానాయుడినే టీడీపీ శ్రేణులు నిలదీశాయి. బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. ఆదోని ఎమ్మెల్యే డౌన్ డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్థసారథి టీడీపీ నేతలను దూరం పెట్టడం, కాంట్రాక్టర్లు, పనుల్లో వారికి వాటాలు ఇవ్వనీయక పోవడంతో వారు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు.
‘ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిచ్చగాళ్లు అయిపోయారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఏ పనిలోనైనా 70 శాతం టీడీపీ, మిగిలిన 30 శాతం ఎమ్మెల్యేకు అప్పగించాలి. మేము లేకుంటే బీజేపీ ఎలా గెలిచేది? దమ్ముంటే ఆయన రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున గెలవాలని సవాల్ చేస్తున్నాం. ఎక్కడో ఉన్న ఆయన్ను తీసుకువచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు’ అంటూ మంత్రిని చుట్టుముట్టారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ నాలుగు మాటలు మాట్లాడి, మంత్రి గెస్ట్హౌస్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు చొచ్చుకు రావడంతో గెస్ట్హౌస్ డోర్ ఆద్దాలు పగిలిపోయాయి.
తిరువూరులో తారాస్థాయికి విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అక్కడి పార్టీ క్యాడర్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. క్యాడర్కు వ్యతిరేకంగా కొలికిపూడి నియోజకవర్గంలో వీరంగం వేయడం, వారు తిరుగుబాటు చేయడంతో అక్కడ పరిస్థితి చేయిదాటి పోయింది. క్యాడర్ అంతా కలిసి కొలికపూడి తమకు వద్దని నియోజకవర్గంతోపాటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆందోళనలు చేసింది. దీంతో రెండు వర్గాలను బుజ్జగించడం, చివరికి కొలికపూడిని పిలిచి విచారించడం మినహా పార్టీ అధిష్టానం ఏమీ
చేయలేకపోయింది.
వర్మ వర్సెస్ జనసేన
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన క్యాడర్ మధ్య విభేదాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. వర్మకు వ్యతిరేకంగా జనసేన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం నాగబాబు పిఠాపురంలో పర్యటించగా, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని నినాదాలు చేశాయి. వర్మకు మద్దతుగా వారు నాగబాబును నిలదీయడం చర్చనీయాంశమైంది. అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి.
ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయని చిత్తూరు ఎమ్మెల్యేలు
చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆ జిల్లా సీనియర్ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయడం లేదు. ఇంత వరకు సమన్వయ కమిటీ సమావేశమే మంత్రి నిర్వహించలేకపోయారు. ఏ నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదని సమాచారం. అందుకే టీడీపీ ఎమ్మెల్యే లేని పుంగనూరుకు వెళ్లి, మొక్కుబడిగా మాట్లాడి వచ్చేస్తున్నారు. ఇతరత్రా ఎక్కడికైనా మంత్రి వెళితే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మీరు కూడా వెళ్లొద్దంటూ వారి ముఖ్య అనుచరులను ఆదేశిస్తున్నట్లు సమాచారం.