అందుకే రాజీనామా చేశాను.. ఆర్‌ఎల్‌డీ కీలక నేత ట్వీట్ వైరల్ | Shahid Siddiqui Quit Jayant Chaudhary Party RLD | Sakshi
Sakshi News home page

అందుకే రాజీనామా చేశాను.. ఆర్‌ఎల్‌డీ కీలక నేత ట్వీట్ వైరల్

Apr 1 2024 4:36 PM | Updated on Apr 1 2024 5:07 PM

Shahid Siddiqui Quit Jayant Chaudhary Party RLD - Sakshi

న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌ని జ‌యంత్ చౌధ‌రి సార‌ధ్యంలోని రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (RLD) తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు 'షాహిద్ సిద్ధిఖి' పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అయన పదవికి రాజీనామా చేశారు.

సిద్ధిఖి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో భారత ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగం ప్ర‌మాదంలో పడుతున్న సమయంలో చూస్తూ మౌనంగా ఉండలేను. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరికి పంపినట్లు వెల్లడించారు.

జయంత్ చౌదరిని ఉద్దేశించి.. మేము 6 సంవత్సరాలు కలిసి పని చేసాము, ఒకరినొకరు గౌరవించుకున్నాము. నేను.. నిన్ను సహోద్యోగి కంటే కూడా తమ్ముడిగానే భావించాను. ముఖ్యమైన సమస్యలను సోదరభావంతో పరిష్కరించుకున్నాము. మీ దివంగత తాత, భారత రత్న చరణ్ సింగ్‌, మీ దివంగత తండ్రి అజిత్ సింగ్‌ అందరూ కూడా పార్టీ విలువల కోసం నిలబడ్డారు అని షాహిద్ సిద్ధిఖి అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. గరిష్టంగా 80 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో, ఆర్‌ఎల్‌డీ, ఎస్‌బీఎస్‌పీ, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ వంటి వాటిని కలుపుకొని బీజేపీ బలమైన కూటమికి నాయకత్వం వహిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement