చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా.. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సభను అడ్డుకోవడానికే టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారని అంబటి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మంత్రి రాంబాబు మాట్లాడుతూ..
పోడియంలోకి వెళ్లి స్పీకర్పై దాడికి తెగబడ్డారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగింది. సభ నుంచి బయటకు వెళ్లి కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ఎమ్మెల్యేలను ఎలా కొనాలో ప్లాన్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొన్నారు. సంతలో పశువుల్లా ఆ నలుగురు అమ్ముడుపోయారు.
ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను కొనడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబువి కుట్రపూరితమైన రాజకీయాలు. తెలుగుదేశం తీరును ప్రజలు గమనించాలి. చంద్రబాబు ప్రలోభాల హామీలు ఎప్పటికైనా బయటపడతాయి. నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పుడు సస్పెండ్ చేశాం.. తర్వాత బహిష్కరిస్తాం. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు’ అని పేర్కొన్నారు.