కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టి, సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల శత్రవు బీజేపీనేనని, అందుకోసం అంతా ఏకం కావాలన్నారు మమతా.
పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక ఉమ్మడి వేదిక కింద ఏకం కావాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘ వామపక్ష, అతివాద వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నేను పిలుపునిస్తున్నా.బీజేపీని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి’ అని అన్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి బీజేపీ నాయకుడిగా సువేందు అధికారి నిలిచిన తరుణంలోనే మమతా ఈ సందేశం ఇచ్చారు. మే 4న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంతో మమతా పార్టీ ఘోర పరాజయం తప్పలేదు. ఆ సమయంలో బీజేపీపై మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది బీజేపీ గెలుపు కాదని, కుట్ర చేసి గెలిచారని ధ్వజమెత్తారు. నైతికంగా గెలుపు మాత్రం తమదేనని మమతా పేర్కొన్నారు.


