కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఫల్తా నియోజక వర్గంలో ఉన్న అన్ని 285 పోలింగ్ స్టేషన్లలో (సహాయక పోలింగ్ స్టేషన్లు కూడా కలిపి) రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. 2026 మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని ఈసీఐ పేర్కొంది.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ఈసీఐ చెప్పింది.
కాగా, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా ప్రాంతంలో స్థానికులు నిరసన చేపట్టారు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాము అధికార పార్టీకి ఓటు వేసినా తమపై దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించింది. “మేము టీఎంసీకి ఓటు వేసినా కూడా వారు మాపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేయాలి, మహిళలకు భద్రత కావాలి” అని ఆమె తెలిపింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ముగిసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.


