బీజేపీ కేన్సర్‌ లాంటిది | CM Revanth Reddy Severe Comments On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ కేన్సర్‌ లాంటిది

May 11 2024 3:37 AM | Updated on May 11 2024 3:40 AM

CM Revanth Reddy Severe Comments On BJP

రాష్ట్రంలోనికి దాన్ని ఎంతమాత్రం అనుమతించకూడదు 

భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి తెలంగాణలో చోటు లేదు 

రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్లకు కోతే బీజేపీ ఎజెండా 

ఆ పార్టీని నిలువరించే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది

‘మీట్‌ ద ప్రెస్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ కేన్సర్‌ లాంటిదని, దాన్ని రాష్ట్రంలోనికి ఎంతమాత్రం అనుమతించకూడదని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో బీజేపీలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి చోటు లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాచరణ అమలుకే బీజేపీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ మార్పు, రిజ ర్వేషన్లకు కోతే బీజేపీ ఎజెండా అని చెప్పారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.  

బీజేపీ మతాల పేరుతో చీలుస్తోంది 
‘ఎన్నికల్లో ఓడి బలహీనపడ్డ బీఆర్‌ఎస్‌ నిస్సహాయతతోనో, వ్యూహాత్మకమో తెలియదు గానీ.. బీజేపీకి రాష్ట్రాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ప్రమాదకరమైన భావజాలం గల బీజేపీని నిలువరించగల శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు సరిగా లేవని పెట్టుబడులు రావడం లేదు. మరోవైపు హైదరాబాద్‌ అభివృద్ధి జరుగుతోంది. అందు కే పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే విశ్వనగరంగా పేరు తెచ్చుకుంది. పొర పాటున బీజేపీ చేతుల్లోకి అధికారం పోతే, నిట్ట నిలువునా మతాల పేరుతో చీలుస్తుంది. మధ్యయుగ చరిత్రను గుర్తుకు తెస్తుంది..’ అని రేవంత్‌ హెచ్చరించారు.  

ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తోంది 
‘భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా. రాజ్యాంగ మార్పు ద్వారా దేశానికి తీవ్ర నష్టం చేయాలని చూస్తోంది. కొన్ని వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఎంతకైనా దిగ జారుతున్నారు. 2019లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాహూల్‌ గాం«దీపై విష ప్రచారం చేస్తున్నారు. ప్రాంతాల వారీగానూ బీజేపీ అసమానతలు సృష్టిస్తోంది.

కేంద్ర మంత్రి పదవులన్నీ గుజరాత్, యూపీకే ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రధాని ఒక ప్రాంతానికి చెందిన వారుంటే, రాష్ట్రపతి మరో ప్రాంతం వారుండేవారు. గుజరాత్‌ పెత్తందారీ పోకడలకు చెక్‌ పెట్టకపోతే ప్రమాదం..’ అని సీఎం వ్యాఖ్యానించారు.  

బీజేపీ మోసాన్ని ప్రజలు గుర్తించాలి 
    ‘నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీ ఆడాలనుకుంటున్న నాటకం తెలంగాణకు నష్టం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన విభజన చేపడితే తెలుగు రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్‌ ఇండియా వన్‌ నేషన్‌ పేరుతో బీజేపీ చేయాలనుకునే మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ఓటు వేయడం సామాజిక బాధ్యతగా ప్రజలు గుర్తించాలి. ప్రమాదకరమైన బీజేపీ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి..’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. 

బాండ్లపై విచారణకు సిద్ధం 
    ‘ఎన్నికల బాండ్లపై విచారణకు మేం సిద్ధం. ఎన్నికల ఖర్చు, పార్టీలకు వస్తున్న ఆదాయంపై ఓ కమిటీని నియమించి విచారణ జరిపించాలి. ఇందుకు మా పార్టీ సిద్ధం. ఏ సంస్థ దగ్గరా డబ్బులు తీసుకోకుండా, తమ జేబుల్లోంచి తెచ్చి ఎన్నికల ఖర్చు చేస్తున్నామని భద్రాచలం రాముల వారి దగ్గర నరేంద్రమోదీ గానీ, ఆ పార్టీ వాళ్ళుగానీ ప్రమాణం చేసి చెప్పగలరా? తన పక్కనే అవినీతి పరులను కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ఆస్తులు కూడబెడితే, నరేంద్రమోదీ సర్కార్‌ బడా పారిశ్రామిక వేత్తలకు వాటిని ధారాదత్తం చేసింది. ఇన్ని చేసిన మోదీ నిజాయితీపరుడినని చెప్పుకోవడం హాస్యాస్పదం..’ అని సీఎం విమర్శించారు. 

బీఆర్‌ఎస్‌కు కొన్నిచోట్ల డిపాజిట్లు రావు 
    ‘ఒవైసీని గెలిపించేందుకే బీజేపీ ఓల్డ్‌ సిటీలో వివాదాస్పదమైన వ్యక్తిని పోటీలో పెట్టింది. నరేంద్రమోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. కేసీఆర్‌ మానసిక ఒత్తిడితో నాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రావు. కల్తీ కల్లు, డ్రగ్స్‌పై మా సర్కార్‌ ఉక్కుపాదం మోపుతుంది. బీసీ కులగణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలన్నదే మా విధానం ..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్, పలువురు సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement