
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు.
ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు , అభ్యర్థి ఎంపిక పై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్
దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్.
‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు.