మార్కులు సక్రమంగా వేశారా?
పెద్దపల్లి: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 10జీపీఎస్ సాధించేందుకు ఇంటర్నల్ మార్కులు అత్యంత కీలకం. ప్రతీసబ్జెక్టులో 100 మార్క్లకు 20 ఇంటర్నల్ మార్క్లు కేటాయిస్తారు. వీటిని సక్రమంగా వేశారా? లేదా? అనే విషయాన్ని ఏటా వార్షిక పరీక్షలకు ముందు జిల్లా విద్యాశాఖ తనిఖీ చేస్తుంది. ఈసారి కూడా ఈనెల 12 నుంచి 19 వరకు తనిఖీ చేయాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజులపాటు తనిఖీలు వాయిదా వేసినా మళ్లీ కొనసాగిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతోపాటు కస్తూరిబా, మోడల్, గురుకులాల్లో తనిఖీలు చేస్తున్నాయి.
7,495 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా 207 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో విద్యార్థులు సుమారు 7,495 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి తరగతి ప్రాజెక్టు వర్క్, రికార్డు బుక్స్, ఫార్మేటివ్ పరీక్షలు తదితర అంశాల్లో 20 మార్కులు కేటాయిస్తారు. వీటిని ఉపాధ్యాయులు సరిగ్గా కేటాయించారా? లేదా? అనేదానిని విద్యాశాఖ కేటాయించిన 34 బృందాలు ఈసారి తనిఖీ చేస్తున్నాయి. ఒక్కో బృందంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిపాటు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరు మార్కు లు తనిఖీ చేసి నివేదిక రూపొందిస్తారు. ఈనెల 19న తనిఖీలు ముగించి నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈమేరకు అధికారులు తనిఖీలు విస్తృతం చేశారు.
ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు బృందాలు
రేపటితో ముగియనున్న తనిఖీలు
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యం


