
ముసురు ముప్పు
● పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం ● కలుషితనీరు, అపరిశుభ్ర వాతావరణం ● జిల్లావాసులకు పొంచిఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు
గత మూడేళ్లలో జిల్లాలో నమోదైన సీజనల్ వ్యాధులు
సాక్షి, పెద్దపల్లి/కోల్సిటీ: అప్పుడే ఎండ.. కాసేపటికే వాన.. ఆ తర్వాతే ఉక్కపోత.. ఇలా ఒకేరోజు భిన్న వాతావరణం నెలకొడంతో జిల్లావాసులు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు. జ్వరాలు, దగ్గు, జలుబు వంటివాటితో బాధపడుతూ ఆస్ప త్రుల పాలవుతున్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారు ల పాలన, బల్దియాల్లో వందరోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నా పారిశుధ్యం లోపిస్తోంది. వర్షపు నీరునిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి.
29 హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు
జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. ఈఏడాది మొత్తం 29 హైరిస్క్ గ్రామాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో నమోదైన డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులను పరిగణనలోకి తీసుకొని హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. ప్రధానంగా ధర్మారం మండలం పత్తిపాక, రామగుండం నగరంలోని మురికివాడలు ప్రమాదకరంగా ఉన్నాయని అంచనాకు వచ్చారు. ఆయా ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉంది. మురుగునీటి గుతంతల్లో గంబూషియా చేపలు వదలాల్సి ఉంది. యాంటీ లార్వా, ఆయిల్బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్ చేపట్టాల్సి ఉంది. కానీ, ఇవేమీ చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
అధికారులు, ప్రజలు ఇలా చేయాలి
● నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
● పైపులైన్ లీకేజీలకు మరమ్మతు చేయాలి
● డ్రైనేజీల్లో రసాయనాలు పిచికారీ చేయించాలి
● లార్వా నివారణకు మురుగునీటిగుంతల్లో ఆయిల్బాల్ వేయాలి
● నీటి గుంతల్లో గంబూషియా చేపలు వదలాలి. వీధుల్లో ఫాగింగ్ చేయాలి
● డెంగీ కారక దోమ కాటువేయకుండా మోకాళ్ల వరకు నూనె రాసుకోవాలి
● పాత సామగ్రి, పాత టైర్లలో నీటినిల్వలు ఉండకుండా చూసుకోవాలి
● నీటి డ్రమ్ములను రెండ్రోజులకోసారి కచ్చితంగా శుభ్రం చేయాలి
● ఇళ్ల కిటికీలకు జాలీలు, దోమతెరలు అమర్చుకోవాలి.
రామగుండంలో లోపించిన పారిశుధ్యం..
రామగుండం నగరంలో పారిశుధ్యం లోపించింది. చెత్త సేకరణ సాఫీగా సాగడంలేదు. చాలాచోట్ల రోడ్ల పక్కనే కుప్పలుగా దర్శనమిస్తోంది. కొందరు కాలనీవాసులు మురుగునీటి కాలువలు, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కొన్నిరోజులుగా అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులతో చెత్త కుళ్లి కంపుకొడుతోంది. దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరవాసుల్ని ఎడాపెడా కుట్టేస్తూ ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. రక్తాన్ని పీల్చేసి ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ అమలు చేయకుంటే డెంగీ, మలేరియా, డయేరియా, వైరల్, విషజ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
పారిశుధ్యంపై పట్టింపే లేదు
నివాసాల మధ్య ఖాళీ ప్లాట్లలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, వ్యర్థాలు దోమలు, ఈగలు, ప్రాణాంతక వైరస్కు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్లాట్లను శుభ్రం చేసి జరిమానా విధించి వసూలు చేసే అధికారం బల్దియా అధికారులకు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షపునీరు రోజుల తరబడి నిల్వ ఉండడంతో లార్వా పుట్టుకొచ్చి దోమల బెడద అధికమైంది. ఏటా దోమల నివారణకు సుమారు రూ.30లక్షల నుంచి రూ.70 లక్షలకుపైగా నిధులు వెచ్చిస్తున్నా.. పరిస్థితి మెరుగుపడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మొక్కుబడిగా ఫాగింగ్..
దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ యంత్రాలు ఉన్నా.. అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్కు వినియోగించే ఆటోట్రాలీ గౌతమినగర్లో ఆర్నెల్ల క్రితం కాలిపోయింది. ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఒక వాహనంతోనే ఫాగింగ్ చేస్తున్నారు. ఏడు హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలు ఉన్నా నిరుపయోగమే అయ్యాయి. నీటినిల్వ ప్రాంతాల్లో యాంటి లార్యా ఆయిల్బాల్స్ వేయడం లేదు. బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదు. కాలువల్లో పూడికను మొక్కుబడిగా తీస్తూ ఈ దృశ్యాలను ఫొటోలు తీసి గ్రూపుల్లో పోస్ట్ చేసి మిన్నకుంటున్నారు.
రోడ్డుపైనే చెత్తతో దర్శనమిస్తున్న ఈ రోడ్డు పెద్దపల్లి హనుమాన్నగర్లోనిది. ఇదేకాదు.. ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్తకుప్పులు పేరుకు పోయాయి. పారిశుధ్యం మెరుగు, పట్టణ రూపురేఖలు మార్చడానికి ఈనెల 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అధికారులు రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. నిధుల కొరత, శాఖల మధ్య సమన్వయలోపంతో ఈ కార్యక్రమం నామమాత్రానికే పరిమితమైంది.
సంవత్సరం మలేరియా డెంగీ చికున్గున్యా
2022 5 215 0
2023 0 151 0
2024 0 115 12
ఇది గోదావరిఖని విఠల్నగర్లోని ఓపెన్ నాలా. మురుగునీరు వెళ్లకుండా పూడికతో ఇలా నిండిపోయింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. పూడిక తీయడంలేదు. వాస్తవంగా ఏప్రిల్, మే వరకు పూడిక తీయాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ చిత్రమే అద్దంపడుతోంది. ప్రస్తుతం 100 రోజుల కార్యాచరణ చేపట్టినా ఆశించిన స్థాయిలో పూడికతీత పనులు ముందుకు సాగడంలేదు.

ముసురు ముప్పు