
ఫలించిన ఓపెన్ చాలెంజ్
● నెరవేరిన ప్రధానోపాధ్యాయుడి లక్ష్యం ● రచ్చపల్లి సర్కార్ స్కూల్లో వందశాతం ప్రవేశాలు
ధర్మారం(ధర్మపురి): ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లలకన్నా బాగా చదవగలరా? అలా ఒక్కరు చదివినా రూ.500 నజరానా ఇస్తాం’ అని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంశీమోహానాచార్యులు చేసిన ఓపెన్ చాలెంజ్ సత్పలితాలిచ్చింది. బడీడు విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే కనిపిస్తున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు చాలెంజ్తోపాటు తల్లిదండ్రులకు నమ్మకం కలిగించారు. గతేడాది 36 మంది విద్యార్థులు ఉంటే అందులో నుంచి ఆరుగురు బయటకు వెళ్లారు. తద్వారా 30 మంది మాత్రమే మిగిలారు. దీనిని సవాల్గా తీసుకున్న హెచ్ఎం గత ఫిబ్రవరి 21న బడిబాట ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సవాల్ చేస్తూ పోస్టర్లు ముద్రించి ఇంటింటా పంచారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ఇంటికి వెళ్లి సర్కారు బడి విద్యార్థులతో పోటీపెట్టించి భేష్ అనిపించుకున్నారు. దీంతో ఆ గ్రామ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులపై నమ్మకం ఏర్పడింది. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు ఒక్కవిద్యార్థి కూడా వెళ్లకుండా తీర్మానించారు. వందశాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే ప్రవేశం కల్పించారు. 30 మందికి మరో 20 మంది కొత్తగా అడ్మిషన్ పొందడంతో ఇప్పుడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 50కి చేరింది. వారిరాకతో కళకళలాడుతోంది.