
దొంగను పోలీసులకు పట్టించిన రైతులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని మోతె బైపాస్ రోడ్డులో వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్న దొంగను రైతులు పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన యువకులు ఆదాబ్, సయ్యద్, సాహెబ్ కొద్దికాలంగా మోతె శివారులోని మోటార్లు, విద్యుత్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సలాకలు, మోటార్ వైర్లు దొంగలించి తీసుకెళ్తుండగా రైతులు వెంటపడ్డారు. ఇద్దరు దొంగలు పారిపోయారు. ఒక దొంగను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. ఏడాదికాలంగా దాదాపు 30 నుంచి 40 విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, గతంలో కూడా దొంగలను పోలీసులకు పట్టిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.