శాతవాహనలో ఎంఫార్మసీ కోర్సుకు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

శాతవాహనలో ఎంఫార్మసీ కోర్సుకు ఆమోదం

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 2:11 PM

కరీంనగర్‌టౌన్‌: శాతవాహన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంఫార్మసీ కోర్సును ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి యు.ఉమేశ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మానేరుడ్యాం పక్కన ఉన్న ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో ఈనూతన ఎంఫార్మసీ కోర్సును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఫార్మకాలజి, ఫార్మాసిటిక్స్‌, ఫార్మసిటికల్‌ అనాలసిస్‌ విభాగాలలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లకు అడ్మిషన్లకు అనుమతి లభించిందన్నారు. ఇదే కళాశాలలో ఫార్మసీ విద్యను అభ్యసించిన వారికి పీజీ కూడా ఇక్కడే చదువుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీశైలం, రిజిస్ట్రార్‌ జాస్తి రవికుమార్‌ వీసీ ఉమేశ్‌కుమార్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

శంకరపట్నం: మండలంలోని కాచాపూర్‌శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహ నం ఢీకొని తాటికొండ పుష్పలీల(65), రామస్వామి (68) దంపతులు చనిపోయారని ఎస్సై రవి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, పుష్పలీల ద్విచక్రవాహనంపై హుజూరాబాద్‌ వెళ్తున్నవారు. మార్గమధ్యలో మండలంలోని కాచాపూర్‌ శివారులో వీరి వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పుష్పలీల అక్కడికక్కడే మరణించింది. రామస్వామికి తీవ్రగాయాలు కాగా 108 లో వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మలేసియాలో గుండెపోటుతో మల్లాపూర్‌ వాసి..

మల్లాపూర్‌: ఉపాధి కోసం మలేసియా వెళ్లిన మల్లాపూర్‌ మండలకేంద్రానికి చెందిన నారి తుక్కారాం (35) పదిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందినట్లు గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. స్థానికుల కథనం ప్రకారం.. తుక్కారాం ఉపాధి కోసం కొంతకాలంగా మలేసియాకు వెళ్లివస్తున్నాడు. ఈనెల 3న అక్కడే గుండెపోటు రావడంతో మరణించాడు. అక్కడి భారతీయుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుక్కారాం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను కోరారు.

పరుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

తిమ్మాపూర్‌: పైళ్లెన నెల రోజుల్లోపే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన పెసర శ్రీకాంత్‌(30)కు మే 16న వివాహమైంది. వారం క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. శ్రీకాంత్‌ బుధవారం అత్తగారింటికి వెళ్లి వచ్చిన తర్వాత పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

ఉరేసుకొని యువకుడు..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి యైటింక్లయిన్‌కాలనీ షిర్కెక్వార్టర్స్‌ ఏరియాలో నివాసం ఉంటున్న గోషిక రోహిత్‌(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్‌.. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లడంతో అతను నిద్రపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. సాయంత్రం వరకూ కుమారుడు బయటకు రాకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా అప్పుడికే ఉరేసుకొని కనిపించాడు. తమ కుమారుడిని కొందరు ఆర్థికపరమైన లావాదేవిల కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని మృతుని తండ్రి అశోక్‌ పోలీసులకు తెలిపాడు. ఈవిషయంపై తమకు ఫిర్యాదు అందలేదని గోదావరిఖని టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపూ విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement