
ఆస్పత్రుల్లో అప్రమత్తం
● భద్రతా చర్యలపై నిరంతర నిఘా ● సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ తప్పనిసరి ● అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించండి ● గోదావరిఖని ఏసీపీ రమేశ్ ● జీజీహెచ్, సింగరేణి ఆస్పత్రుల తనిఖీ
గోదావరిఖని/కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో భద్రతా చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆస్పత్రి అధికారులను ఏసీపీ రమేశ్ కోరారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి ఏసీపీ జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. వైద్య సిబ్బందిపై దాడులు, ఆస్పత్రుల నుంచి పిల్లల కిడ్నాప్ తదితర ఘటనలపై ఆస్పత్రి అధికారులతో చర్చించారు. మెడికల్ సూపరింటెండెంట్ దయాల్సింగ్తో భేటీ అయ్యారు. వైద్యం కోసం వచ్చే అనుమానస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలన్నారు. ఆస్పత్రుల్లో అనూహ్య ఘటనలు జరిగితే వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రులపై బంధువులు, కుటుంబ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని, ముందస్తు భద్రత, రక్షణ కోసం ఆస్పత్రి ముఖద్వారం, ఎగ్జిట్ డోర్, ఆస్పత్రి మెయిన్ రోడ్లు, ఎమర్జెన్సీ, చిల్డ్రన్స్, మెటర్నటీ, క్యాజువాలిటీ వార్డ్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తరచూ వాటిని పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, డాక్టర్లు, జీజీహెచ్ ఆర్ఎంవో రేణుకతోపాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.