
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా
● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు
● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్
● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి?
అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా.
మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు?
అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన ఏ శాఖ కేటాయించినా 100శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా.
మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర?
అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది.