
తొలిరోజు తీపిగురుతులెన్నో..
● బడి.. ఓ మధుర జ్ఞాపకం ● చదువుతోనే భవిష్యత్ అంటున్న ఉన్నతాధికారులు ● పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ప్రముఖుల బాల్యస్మృతులు
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: బాల్యం అంటే బడి.. పాఠశాలకు తొలిఅడుగు.. జీవితంలో మరిచిపోలేని మధుర క్షణం.. ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిజ్ఞాపకం.. వేసవి సెలవుల్లో అనేక వ్యాపకాల్లో మునిగితేలిన పిల్లలు.. బడిగంట మోగగానే స్కూల్కు వెళ్లడానికి కాస్త బెరుకుగానే ఉంటారు. దీనిని ‘స్కూల్ ఫోబియా’ అంటారు. దీన్నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో తమ చిన్ననాటి బడి స్మృతులను ‘సాక్షి’తో పంచుకున్నారు పలువురు ప్రముఖులు. చిన్ననాటి అనుభవాలనూ వారు గుర్తు చేసుకున్నారు. వారి మాట్లల్లోనే..
అమ్మతో కలిసి పోయేది
మా అమ్మానాన్న కోయ సులోచన –నాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వేసవి సెలవులు పూర్తయ్యాక అందిరిలాగే అమ్మ పనిచేసే ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల సర్కారు బడికి తొలిరోజు నుంచే పోయేవాడిని. అక్కడే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివా. మొదటిరోజు ఫ్రెండ్స్తో ఆటాపాలతో గడిచిపోయింది. జీవితంలో పైకిరావడానికి బుడిబుడిఅడుగులు అక్కడే పడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంకంటే మౌలిక వసతులు పెరిగాయి. విద్యతోపాటు సామాజికాంశాలు, ఆటలు, ఇతర అంశాలపై పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుంది. ‘బడీడు’ పిల్లలందరూ బడిలో ఉండాలి. ప్రతీఒక్కరు చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటేనే ఉన్నత స్థానాలకు చోరుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివా. లక్ష్యం సాధించా.

తొలిరోజు తీపిగురుతులెన్నో..