
కృత్రిమ మేధతో ఉజ్వల భవిష్యత్
● 10 వేలకన్నా తక్కువ ర్యాంక్ వస్తే ఫీజు మాఫీ
● మంచి ర్యాంక్ విద్యార్థులకూ ఉచిత వసతి ● సీఎస్ఎం ఫీజు రూ.లక్ష వరకే..
● సాక్షి ఫోన్ ఇన్లో మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్
రామగిరి(మంథని): ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో కృత్రిమ మేధ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుందని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ వెల్లడించారు. ఎప్సెట్లో పది వేల ర్యాంక్ కన్నా తక్కువ సాధిస్తే వివిధ కళాశాలల్లో ఫీజు మాఫీ వర్తిస్తుందన్నారు. ఉచిత వసతి కల్పిస్తారని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫీజు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెలిబుచ్చిన పలు సందేహాలకు ప్రిన్సిపాల్ సమాధానాలు ఇచ్చారు.
ఆ వివరాలు..
సమాధానాలు ఇస్తున్న
ప్రిన్సిపాల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్
సాక్షి: ఇంజినీరింగ్లో నా కుమార్తెకు 30 వేల ర్యాంక్ వచ్చింది, మంథని జేఎన్టీయూలో సీఎస్ఎం సీటు వస్తుందా?
– కన్నం సుధారాణి, రాంచంద్రం, యైటింక్లయిన్ కాలనీ
ప్రిన్సిపాల్: సీఎస్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మంథని జేఎన్టీయూలో 2020 లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గత సంవత్సరం బీసీ–బీ కోటా వారికి 39 వేల ర్యాంక్ సాధించిన వారికి మంథని కళాశాలలో సీటు వచ్చింది. సీఎస్ఎం కోర్సు ఫీజు రూ.లక్ష వరకు ఉంటుంది.
సాక్షి: నా కుమారుడికి 8వేల ర్యాంక్ వచ్చింది, ఏ కోర్సు మంచిది?
– శ్రీనివాస్, కరీంనగర్
ప్రిన్సిపాల్: ఇంజినీరింగ్ విద్యలో ఏఐ బెటర్. హైదరాబాద్లో మంచి కళాశాలలో సీటు వస్తుంది. ఏ కళాశాలలో సీటు వచ్చినా పది వేల ర్యాంక్ కన్నా తక్కువ సాధిస్తే ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఫీజురీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది.
సాక్షి: మేనేజ్మెంట్ సీటుకు ఫీజురీయింబర్స్మెంట్ వర్తిస్తుందా?
– కీర్తన, గోదావరిఖని
ప్రిన్సిపాల్: మేనేజ్మెంట్ కోటాలో పూర్తిస్థాయి ఫీజు విద్యార్థులే చెల్లించాలి. ఎలాంటి ఫీజురీయింబర్స్మెంట్ పథకం వర్తించదు.
సాక్షి: ఎంఈసీ గ్రూప్తో ఈసీఈలో సీటు వస్తుందా?
– ప్రియాంక్, బాన్స్వాడ
ప్రిన్సిపాల్: ఎంఈసీ గ్రూప్ ద్వారా ఈసీఈ కోర్సులో సీటు రాదు. ఎప్సెట్ ర్యాంక్ ద్వారా మాత్రమే ఇంజినీరింగ్ సీటు సాధించాలి.
సాక్షి: ఎప్సెట్లో నాకు 37 వేల ర్యాంక్ వచ్చింది. సీఎస్సీ, సీఎస్ఎంలో ఏ కోర్సు మంచిది? – ధీరజ్, మెట్పల్లి
ప్రిన్సిపాల్: రెండు కోర్సులు బాగుంటాయి. మీకు సమీపంలోని కొండగట్టు, జగిత్యాలలో సీఎస్సీ కోర్సులో సీటు వస్తుంది, సీఎస్ఎం కోర్సు చేయాలనుకుంటే మంథని కళాశాలలో సీటు లభిస్తుంది.
సాక్షి: ఈఐఈలో జాయిన్ కావచ్చా?
– రోడ్డ ఆదర్శ్, బేగంపేట
ప్రిన్సిపాల్: ఈఐఈ కోర్సు కేవలం హైదరాబాద్ కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంజినీరింగ్ చేయాలనుకునే వారు ఇతర దేశాల్లో చదువుకోవచ్చు.
సాక్షి: మంచిర్యాల జిల్లా నస్పూర్లో సివిల్ డిప్లొమో కోర్సు పూర్తి చేశా. ఈసెట్ ద్వారా మైనింగ్ కోర్సులో జాయిన్ కావచ్చా?
– శ్రీనివాస్, రామగుండం
ప్రిన్సిపాల్: సివిల్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా సంబంధిత కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు పొందే వీలు ఉంటుంది.
సాక్షి: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సు బెటర్?
– రేణుశ్రీ, కృత్తిక, వేములవాడ,
సతీశ్, హన్మకొండ
ప్రిన్సిపాల్: ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లెర్నింగ్, ఏఐ సాంకేతిక కోర్సులు చదివితే ఉద్యోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.
సాక్షి: నాకు 60 వేల ర్యాంక్ వచ్చింది. ఈబీసీ కోటాలో మంథని కళాశాలలో ఏ కోర్సులో సీటు వస్తుంది?
– సాయిప్రియ, ముత్తారం
ప్రిన్సిపాల్: మంథని జేఎన్టీయూలో గత సంవత్సరం ఈబీసీ కోటాలో 60 వేల ర్యాంక్ వచ్చిన వారికి సివిల్, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్ల్లో సీటు రావచ్చు. సీఎస్సీ అయితే డౌట్.
సాక్షి: నాకు 55 వేల ర్యాంక్ వచ్చింది. మంథని కళాశాలలో సీటు వస్తుందా?
– శివరాంరెడ్డి, పెద్దపల్లి
ప్రిన్సిపాల్: ఈడబ్ల్యూఎస్ కోటా కింద గత సంవత్సరం 55 వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఈఈఈ, సివిల్లో సీటు లభించింది. ఏఐలో రెండో కౌన్సెలింగ్ లేదా మూడో కౌన్సెలింగ్లో వచ్చే అవకాశం ఉంది.

కృత్రిమ మేధతో ఉజ్వల భవిష్యత్