
గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు చేయాలి
పెద్దపల్లిరూరల్: గర్భిణులకు సకాలంలో అన్ని వైద్యపరీక్షలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆశ కార్యకర్తలు, నోడల్ పర్సన్లతో గర్భిణులకు అందించే వైద్యసేవలపై డీఎంహెచ్వో సమీక్షించారు. ప్రతీ గర్భిణిని ట్రాక్ చేయాలని, 12వారాల్లోపే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి తగిన చికిత్స అందించాలని సూచించారు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చేవరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని డీఎంహెచ్వో పేర్కొన్నారు. గర్భిణులకు రామగుండం ప్రభుత్వ జనరల్, పెద్దపల్లి ప్రధాన ఆస్పత్రులు, మంథని, సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆమె సూచించారు. సమావేశంలో ఆశ, నోడల్ సైపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.