
మారుపేర్ల మార్పుపై డిప్యూటీ సీఎం సానుకూలం
● ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎంను హైదరాబాద్లో కలిసి సింగరేణిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన విషయం ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. 35 నుంచి 40 ఏళ్లకు వయోపరిమితి పెంపు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5వేల బోనస్, కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. అనేకఏళ్లుగా కార్మికులు మారుపేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేశామన్నారు. కోలిండియా మాదిరిగా సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ చేయాలని కోరారు. ఓన్ యువర్ హౌస్ పథకాన్ని మలు చేయాలన్నారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు నియామాల్లో మార్పులు చేయాలన్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందిని వన్టైం సెటిల్మెంట్ కింద మరో అవకాశం ఇవ్వాలని విన్నవించారు. హైదరాబాద్లో 100రోజుల్లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నారు. సింగరేణిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని, స్థానికంగా ఉద్యోగాలను పెంచేందుకు అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని, పెండింగ్లోని 3,700కుపైగా ఉద్యోగుల కేసుల పరిష్కారం కోసం ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాలన్నారు. భవిష్యత్ కోసం కొత్త గనుల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు జనక్ప్రసాద్ పేర్కొన్నారు.