
ప్రచారం.. విస్తృతం
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం ● సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారుల ముందస్తు చర్యలు ● నగరం, పట్టణాలు, పల్లెల్లో ప్రజలకు అవగాహన
సుల్తానాబాద్(పెద్దపల్లి): వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈసారి రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురవడంతో వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికారులు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అధికారుల అప్రమత్తం
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో డీపీవో, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. వైద్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులూ సమావేశానికి హాజరయ్యారు. నీటి నిల్వలు లేకుండా, డ్రైనేజీలను తరచూ శుభ్రం చేయాలని, రక్షిత తాగునీటి పథకాల్లో తరచూ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరాచేయాలని, నీటి నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గంబూషియా చేపలు వదలాలని సూచించారు. విషజ్వరాలు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమని సూచించారు.
అందుబాటులో ఉండాల్సిందే..
గ్రామాల్లోని హెల్ట్ సబ్ సెంటర్ల పరిధిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, మల్టీపర్పస్ వర్కర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీరందరినీ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఏటా ఏదోవ్యాధి బారిన పడి ఒక్కో కుటుంబం రూ.లక్షల్లో వైద్యం కోసం ఖర్చుచేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని గుర్తించిన సర్కారు.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని భావిస్తోంది.
స్వచ్ఛ శుక్రవారం నిర్వహణపై దృష్టి..
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్ర, మంగళవారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రమ్ములు, కుండలు, ట్యాంకర్లు, టైర్లలోని నీటినిల్వలు పారబోస్తున్నారు. పరిసరాలను మ ల్టీపర్పస్ వర్కర్లతో నిత్యం శుభ్రం చేయిస్తున్నా రు. నీటినిల్వల్లో దోమలు, బ్యాక్టీరియా వృద్ధి చెంది దాడి చేయడంతో ప్రజలు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలు, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. దీంతో నీటినిల్వలు తొలగించడం, పారిశుధ్యం మెరుగుపర్చడం, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టడం, దోమతెరలు వాడడం తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.