
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్
● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు
● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.
అభివృద్ధి పనులపై దృష్టి
జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ
ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
మరిన్ని పనులివే..
● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు.
● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది.
● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు.
● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది.
● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు.
● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.
● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు.