
తాగునీటి కష్టాలకు చెక్
● సింగరేణి కార్మికవాడలకు ఇక సాఫీగా నీటి సరఫరా ● చివరిదశలో ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ పనులు ● 60శాతం పూర్తయిన వాటర్ ఫిల్టర్ నిర్మాణం ● మూడునెలల్లో అందుబాటలోకి వచ్చే అవకాశం ● మిషన్ భగీరధ తరహాలో తాగునీటి సరఫరా
గోదావరిఖని: సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు యాజమాన్యం ముందుకు సాగుతోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ తరహాలో తాగునీరు అందించాలనేది యాజమాన్య లక్ష్యం. ఈమేరకు గోదావరినది నుంచి నీటిని తీసుకుని ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా శుభ్రం చేసి నల్లాల ద్వారా కాలనీలకు అందిస్తుంది.
వేగంగా గ్రావిటీ ఫిల్టర్ పనులు..
ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని సింగరేణి కార్మిక కుటుంబాలకు గోదావరినది నుంచి పంపింగ్ ద్వారా రోజూ 35 ఎంఎల్డీ నీటిని అందించేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీలకు ప్రస్తుతం పైపులైన్ల ద్వారా నీటిని అందిస్తోంది. గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్బెడ్ నుంచి భారీ విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తారు.
‘కాళేశ్వరం’తో తిప్పలు
మూడేళ్ల క్రితం వరకు కార్మికవాడలకు నీటిసరఫరా సాఫీగానే సాగింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తిప్పలు మొదలయ్యాయి. ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్తో నదిలో నీటి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో నగరంలోని డ్రైనేజీ, ఆర్ఎఫ్సీఎల్ రసాయనాలు నేరుగా గోదావరినదిలో చేరి నీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన కార్మిక కు టుంబాలు డయేరియా, మలేరియా బారిన పడుతున్నాయి. వర్షాకాలంలో సుమారు నెలరోజుల పాటు కలుషిత నీరే సరఫరా అవుతోంది. నదిలో, ఏరియాల వారీగా సింగరేణి యాజమాన్యం ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసినా కార్మిక కుటుంబాలకు కలుషిత నీరే దిక్కయ్యింది.
రెండేళ్ల క్రితం మిషన్ భగీరథ తరహాలో..
తమకు మినరల్ వాటర్ అందించాలని సింగరేణి కార్మిక కుటుంబాల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో మిషన్భగీరథ తరహాలో తాగునీరు అందించేందుకు రెండేళ్ల క్రితం అప్పటి సీఎండీ శ్రీధర్ నిధులు మంజూరు చేశారు. సాంకేతిక కారణాలతో ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ కోసం కేటాయించిన నిధులు నిలిచిపోయాయి. దీంతో ప్లాంట్ పనులు ఆగిపోయాయి.
ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ఫిల్టర్ సమాచారం
నీటి సామర్థ్యం
(రోజూ ఎంఎల్డీ) 35
అంచనా వ్యయం
(రూ.కోట్లలో) 20
రోజూ నీటి సరఫరా ఇలా
ఏరియా నీటి సామర్థ్యం(ఎంఎల్డీ)
ఆర్జీ–1 20
ఆర్జీ–2 10
ఆర్జీ–3 05
సకాలంలో పూర్తిచేస్తాం
ర్యాపిడ్ గ్రావిటీ నిర్మాణం సకాలంలో పూర్తిచేస్తాం. వర్షాలతో అప్పట్లో పనుల్లో జాప్యమైంది. అయినా, ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తిచేస్తాం. మూడు నెలల్లోగా ర్యాపిడ్గ్రావిటీ ప్లాంట్ ప్రారంభిస్తాం.
– లలిత్కుమార్, జీఎం, ఆర్జీ–1
శరవేగంగా ప్లాంట్ నిర్మాణం
ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ నిర్మాణం కోసం సింగరేణి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఆర్జీ–1 ఏరియా జీడీకే–1, 3గని ఫ్యాన్హౌస్ సమీపంలో 35 ఎంఎల్డీ సామర్థ్యంతో ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్కు గతేడాది మార్చి 16న డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ భూమిపూజ చేశారు. పనుల ప్రారంభంలో రెండునెలలు జాప్యం జరిగింది. ప్రస్తుతం సివిల్ పనులు 80 శాతం, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు 20శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సగటున 60శాతం పనులు పూర్తయ్యాయని వారు వివరించారు.