మూలకు చేరిన రక్తసేకరణ వాహనం
విజయనగరం ఫోర్ట్: ప్రతీ రోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి రక్త సేకరణ చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రక్త సేకరణ వాహనం మూలకు చేరినట్టు తెలుస్తుంది. గత కొద్ది నెలలుగా వాహనాన్ని తీయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం సుమారు రూ.35 లక్షలు వెచ్చించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి దీన్ని ఇచ్చారు. రక్తసేకరణ కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక డ్రైవర్ను కూడా నియమించారు. రక్త సేకరణకు అవసరమైన అన్ని పరికరాలు వాహనంలో సమకూర్చారు. ప్రతీ రోజు వాహనం ద్వారా కనీసం 30 యూనిట్ల రక్తసేకరణ చేయాలన్నది లక్ష్యం. అయితే ప్రతీ రోజు కాదు కదా.. వారానికి ఒకసారి కూడా రక్తసేకరణకు వాహనం తీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో సర్వజన ఆస్పత్రికి ఎక్కువ మంది రోగులు వస్తారు. అందులోనూ ఆస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్య తరగతి వర్గానికి చెందిన వారే. ఆస్పత్రిలో నిత్యం 50నుంచి 70 మంది వరకు రక్తం అవసరం పడుతుంది. అంతమందికి రక్తం అందించాలంటే నిత్యం రక్తసేకరణ జరగాలి. అయితే వాహనం ద్వారా రక్తసేకరణ జరగకపోవడం వల్ల రోగులు రక్తం కోసం అవస్థలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రక్తసేకరణ వాహనం కోసం నియమించిన సిబ్బందిని వేరే విధులకు వినియోగిస్తున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వృథాగా వదిలేసిన రూ.35 లక్షల
విలువైన వాహనం
నా దృష్టికి రాలేదు..
రక్తసేకరణ వాహనం మూలకు చేరిన విషయం నా నోటీస్కు రాలేదు. విచారణ చేపట్టి వాహనం ద్వారా రక్త సేకరణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


