అడ్డాపుశీల ఆలయంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం రూరల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అడ్డాపుశీల గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి గురువారం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు, బారికేడ్ల పటిష్టత, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు మహిళలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళ అదనపు గస్తీ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, సీఐ రంగనాథం, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


