పెద్దలకు ఆపన్నుహస్తం!
సాలూరు: పట్టణంలో కోటిరూపాయల మేర పన్నుల ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారా? లేక సీ్త్ర,శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావున మౌనంగా ఊరుకుంటారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మరింది. పట్టణంలో ఉన్న కొంతమంది పెద్దల ఆస్తులు, ఖాళీ స్థలాలకు సంబంధించి సుమారు కోటి రుపాయల మేర పన్నుల రద్దుకు అధికారులు విఫలయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంత గోప్యం
సుమారు కోటి రుపాయల పన్నులను రద్దుచేసినట్లు కౌన్సిల్లో ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించాలని మున్సిపల్ అధికారులు వారి వెనకున్న కొందరు అధికార పార్టీ నేతల ప్రయత్నం విఫలమైంది. జనవరి 31న మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాధారణ అజెండా కాపీలను కౌన్సిలర్లకు, హాజరైన మీడియా సభ్యులకు అందించారు.అత్యవసర సమావేశానికి సంబంధించిన టేబుల్ అజెండా కాపీలను ఎవరికీ అందించకుండా అధికారులు గోప్యతను ప్రదర్శించారు. సాధారణ సమావేశం ముగిసిన తరువాత టేబుల్ అజెండాలో ఉన్న కోటిరుపాయల పన్ను రద్దు అంశాన్ని అధికారులు చదివి వినిపించారు. వెంటనే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఈ అజెండాలోని అంశాన్ని ఆమోదించబోమంటూ తిరస్కరించారు.
కళ్లున్న కబోదుల్లా..?
మరోవైపు కొందరు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. కళ్ల ముందే వారసులు పట్టణంలో తిరుగుతూ కనిపిస్తున్నా, ఇంటిపేర్లలో చిన్న చిన్న తప్పిదాలున్నా అటువంటి ఆస్తుల పన్నుల రద్దుకు అధికారులు సిఫారసు చేయడంపై సంబంధిత మున్సిపల్ అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండవల్లి కామరాజు అండ్ సన్స్కు సంబంధించిన ఖాళి స్థలాల పన్నుల బకాయి రూ.54,12,053 ఉంది. వారసులు కళ్లముందు తిరుగుతున్నా పన్ను రద్దుకు అధికారులు సిఫారసు చేశారు. సుతాపల్లి రాముకు సంబంధించి ఖాళీ స్థలాల పన్ను రూ.23 వేల 331 రద్దుకు అధికారులు నాన్ ట్రేస్డ్ అని చెప్పి సిఫారసు చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచి పన్నులను ముక్కు పిండి వసూలు చేసే అధికారులు, పెద్దల వద్ద ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక అధికారులు, అధికార పార్టీ నేతల పరస్పర ఒడంబడికలే కారణమై ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది.
కోటి రూపాయల మేరకు కత్తెర?
మున్సిపాలిటీలో రూ.కోట్ల మేర పన్నులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.4.4 కోట్ల డిమాండ్లో 106 అసెస్మెంట్లకు రూ.20 లక్షల మేరకు రద్దు చేయాలని కౌన్సిల్ ఆమోదానికి సిఫార్సు చేశారు. అదే కాక మున్సిపాలిటీలో ఉన్న కొందరు పెద్దలకు చెందిన 39 అసెస్మెంట్ల సొమ్ము రూ.87 లక్షల 25 వేలనుసైతం రద్దు చేయాలని అధికారులు సిఫార్సు గమనార్హం.
సుమారు రూ.కోటి రద్దుకు అధికారుల విఫలయత్నం
ప్రభుత్వ ఆదాయానికి గండి
కొట్టేందుకు తెరవెనుక డ్రామాలు
అధికారులు, సిబ్బందిపై విచారణ జరిగేనా?


