హిందువుల గుండెలను గాయపరచొద్దు
సాలూరు: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుపతి వేంకటేశ్వరస్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయంలో అదేపనిగా అభాండాలు, ఆరోపణలు చేస్తూ ప్రపంచం నలుమూలలా ఉన్న హిందువుల గుండెలను గాయపరచ వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, విద్యాశాఖమంత్రిలోకేష్తో పాటు టీడీపీ నేతలకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, అనేక హిందూ ఆలయాల్లోని ప్రసాదాల్లో తిరుమలతిరుపతి లడ్డూ రుచి ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అటువంటి తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించారంటూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న చంద్రబాబు, పవన్కల్యాణ్లు అభాండాలు వేశారన్నారు. ఈ అభాండాలు, ఆరోపణలపై సుప్రీంకోర్టు కలుగచేసుకుని ఉన్నతపదవుల్లో ఉన్న మీరే విచారణ పూర్తికాకుండా అపనిందలు వేయడం సరికాదని కూటమి పెద్దలకు హితవు పలికిందన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సిట్ విచారణ వేయగా ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లలో సీబీఐ సిట్ పలుమార్లు తనిఖీ చేసి లడ్డూ తయారీకి నెయ్యిలో ఎటువంటి కొవ్వు వాడలేదని తెలిపిన విషయాన్ని వివరించారు.
హుందాగా క్షమాపణ చెప్పండి
అయినప్పటికీ నేటికీ చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు ఇంకా లడ్డూ వ్యవహారంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ మరింత రాద్ధాంతం చేయడం ద్వారా కోట్లాది మంది స్వామివారి భక్తుల మనో భావాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఎటువంటి జంతువుల కొవ్వు ఉపయోగించలేదని సిట్ చెబుతున్న నేపథ్యంలో బేషరతుగా చంద్రబాబు, కూటమి నేతలు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించాలని లేకుంటే కనీసం మౌనంగా ఉండి ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టాల్సి ఉందన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అభాండాలు, తప్పుడు ప్రచారాలు సనాతన ధర్మ చరిత్రలో ఓ మాయని మచ్చగా నిలిచిపోతాయని ఇది ఓ భక్తుడిగా తన భావన అన్నారు. ఇకనైనా పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి లడ్డూలో కొవ్వు వాడలేదని
సిట్ నివేదిక స్పష్టం
అయినా చంద్రబాబు, పవన్కల్యాణ్ల రాద్ధాంతం
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


