అంగన్వాడీ సేవలు విస్తృతం కావాలి
● కలెక్టర్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం: అంగన్వాడీ సేవలు మరింత విస్తృతం కావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకుడు ఎం.వేణుగోపాలరెడ్డితో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.సూర్యకుమారి కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పోషకాహార సూచికలు, టేక్హోం రేషన్ పంపిణీ, పీఎస్ఈ హాజరు, ఆధార్, టీనేజ్ గర్భధారణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీలకు సూచించారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మండల స్థాయిలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి పిల్లల ఎత్తు, బరువును పునఃపరిశీలించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు, తాగునీటి వసతులను పదిరోజుల్లో పూర్తి చేయాలన స్పష్టం చేశారు. ప్రీ స్కూల్ హాజరులో మన్యం జిల్లా పనితీరు అద్భుతంగా ఉండడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ను ప్రత్యేకంగా అబినందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.కనకదుర్గ, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
బిల్లు చెల్లించకుంటే..
సచివాలయానికి తాళం వేస్తా?
జియ్యమ్మ వలస రూరల్: వారం రోజుల్లో బిల్లులు చెల్లించకుంటే తాను నిర్మించిన గ్రామ సచివాలయానికి తాళం వేస్తానని కాంట్రాక్టర్ జోగి సంతోష్ కుమార్ హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో గ్రామ సచివాలయాల నిర్మాణాలు జరిగిన నేపథ్యంలో డంగభద్రలో రూ.42 లక్షలతో సచివాలయ భవనం పూర్తిస్థాయిలో నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించలేదని సంబంధిత కాంట్రాక్టర్ తెలిపారు. వివిధ దశల్లో రూ.28 లక్షల 50 వేల వరకు చెల్లించి మిగిలిన సొమ్మును నేటికీ ఇవ్వకపోవడంతో సచివాలయానికి తాళం వేస్తానని ఆయన పట్టుబట్టారు. గ్రామంలో ఇప్పటివరకు పాడుబడిన ఓ అద్దె ఇంటిలో సచివాలయం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఎంపీడీఓ ధర్మారావు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను త్వరలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న సచివాలయ భవనంలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు భయపడుతున్నారని, కావున నూతన నిర్మాణం చేపట్టిన భవనంలోకి తాత్కాలికంగా విధులు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించాలని కాంట్రాక్టర్ను కోరారు. అందుకు అంగీకరించిన కాంట్రాక్టర్ నూతన సచివాలయాన్ని అనధికారికంగా అప్పగించారు. అయితే ప్రభుత్వం మారి మూడేళ్లు అవుతున్నా సచివాలయం నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో వారం రోజుల్లో తనకు రావాల్సిన బిల్లును చెల్లించకుంటే సచివాలయానికి తాళం వేస్తానని కాంట్రాక్టర్ హెచ్చరించాడు.


